Rajesh Khattar: తినడానికి తిండి లేని దుస్థితి అంటూ వార్తలు.. స్పందించిన నటుడు

Rajesh Khattar Dismisses Rumours That he Ran Out of Money - Sakshi

బాలీవుడ్‌ నటుడు రాజేశ్‌ ఖత్తర్ ఆర్థికంగా ఇబ్బందులపాలయ్యాడని, చేతిలో డబ్బుల్లేక కుటుంబాన్ని పోషించడమే కష్టమవుతోందంటూ కొంతకాలం క్రితం ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇందుకు కారణం లేకపోలేదు.. 2021లో​ రాజేశ్‌ ఖత్తర్‌ భార్య వందన సజ్నానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు, తన కొడుకు యువాన్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తమ దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని పేర్కొంది. దీంతో రాజేశ్‌ దీన స్థితిలో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది.

తాజాగా ఆనాటి పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు రాజేశ్‌ ఖత్తర్‌. ఆయన మాట్లాడుతూ.. 'అప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాం. లాక్‌డౌన్‌లో నా భార్య వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో మేము దాచుకున్న సేవింగ్స్‌ అయిపోయాయని చాలా మామూలుగా చెప్పింది. కానీ వారం రోజుల్లో ఆ వార్త మార్మోగిపోయింది. తినడానికి తిండి లేని దుస్థితి అంటూ కథనాలు రాసేశారు. అది చూసి నవ్వుకున్నాను. కొద్ది రోజులకు బంధువులు ఫోన్‌ చేసి మాకు సాయం చేస్తామని చెప్పారు.

మా పరిస్థితి బాగానే ఉందని చెప్పి వారి సాయాన్ని తిరస్కరించాను. అయినా నాకు సినిమా ద్వారానే కాకుండా వేరే దారుల నుంచి కూడా డబ్బు వస్తుంది. నటుడికి తన కెరీర్‌లో పెద్ద మైనస్‌ పాయింట్‌ ఏంటంటే కొన్నింటికి నో చెప్పలేడు. ఇంటి అద్దె కానీ, పిల్లల స్కూలు ఫీజులు కానీ ఎక్కడా బేరాలాడలేడు. నేను పెద్ద స్టార్‌ను కావాల్సింది.. అని కొందరు చెప్తుంటారు. కానీ వాళ్ల మాటలను నేనంత సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే నేనిప్పటికీ వర్క్‌ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు రాజేశ్‌ ఖత్తర్‌.

చదవండి: ముఖం నిండా గాయాలతో అదా శర్మ, ఏం జరిగిందంటే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top