సెలబ్రిటీలు స్టేజ్పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయా? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఆలోచించి.. ఆచి తూచి వ్యవహరించాలి. లేదంటే వారిపై ట్రోలింగ్ తప్పదు. ముఖ్యంగా సినీ తారలు.. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. వాళ్లకు ఇబ్బంది కలిగించేలా ఒక్క మాట మాట్లాడినా.. సోషల్ మీడియాలో ట్రోల్స్ని ఎదుర్కొవాల్సిందే. తాజాగా టాలీవుడ్ నటుడు సప్తగిరి విషయంలో ఇదే జరిగింది. ఆయన మాటలకు ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆయనను ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అసలు సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? అసలేం జరిగింది?
అందుకే సినిమాలు తగ్గించా
కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన సప్తగిరి.. కొన్నాళ్ల తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అయితే హీరోగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ కమెడియన్గా మారాడు. ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గెస్ట్ రోల్ లో అయినా కనిపించి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం పురుషః. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తన కెరీర్ గురించి సప్తగిరి మాట్లాడుతూ..'ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అయ్యిపోయింది. చేసిన పాత్రలే చేస్తున్నాను. కొత్త కొత్త పాత్రలు కూడా ఎంపిక చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాను. అందుకే డబ్బుకోసం కాకుండా వృత్తిపరంగా సంతృప్తి దొరికే పాత్రలను ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రెగ్యులర్ గా కామెడీ పాత్రలే కాకుండా ఎమోషనల్ పండించే పాత్రలు కూడా చేయాలనీ చూస్తున్నాను. ఎప్పుడో ఏదో ఒక డైరెక్టర్ మంచి క్యారెక్టర్ రాస్తారు.. కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈలోపు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను’ అన్నారు.
రాజాసాబ్.. చిన్న సినిమానా?
అంతవరకు బాగానే మాట్లాడిన సప్తగిరి.. తన జర్నీ గురించి మరింత వివరిస్తూ అనుకోకుండా రాజాసాబ్ని చిన్న సినిమాల లిస్ట్లో కలిపేశాడు. కమెడియన్గా కూడా వరుస సినిమాలను చేస్తున్నానని చెబుతూ..‘ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. రకరకాల సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.
ఆయన చెప్పిన చిన్న సినిమాల లిస్ట్లో ది రాజాసాబ్ని కూడా కలిపేశాడు. ఇక్కడే సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్కి కోపం వచ్చింది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన తమ అభిమాన హీరో సినిమాను చిన్న చిత్రం అంటావా అంటూ సప్తగిరిపై మండిపడుతున్నారు. అంతేకాదు రాజాసాబ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘ఈ చిత్రం రూ. 1000 కోట్లు కాదు.. రూ. 2000 కోట్లు వసూలు చేస్తుంది’ అని చెప్పి.. ఇప్పుడేమో చిన్న సినిమా అనడం ఫ్యాన్స్ని మరింత ఆగ్రహానికి గురి చేసింది. అందుకే సప్తగిరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం.. ఫ్లోలో అలా అన్నాడు కానీ.. ప్రభాస్ సినిమాను కించపరిచే ఉద్దేశం సప్తగిరికి లేదని మద్దతు తెలుపుతున్నారు.
RajaSaab Chinna Movie na🤯
ఈ మధ్య సరస్వతి, #TheRajaSaab, కొక్కరకో.. సినిమాల్లో కనిపించాను. చిన్న స్థాయి సినిమాలు కాబట్టి జనాలకు కనిపించలేదు - సప్తగిరి. pic.twitter.com/ulyCNdx5kx— cinee worldd (@Cinee_Worldd) May 10, 2026


