
ప్రముఖ మ్యూజిక్ ఫ్లాట్ఫామ్ సంస్థ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి చెందిన పాటలను తొలగించింది. భారత ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ మాధ్యమాల్లో పాకిస్తాన్కు సంబంధించిన వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర కంటెంట్ సైతం తొలగించాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పాటిఫై సైతం పాక్ పాటలను తన ఫ్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేసింది.
దీంతో పాకిస్తాన్కు చెందిన ఫేమస్ 'జోల్', 'మాండ్' అనే పాటలను స్పాటిఫై నుంచి తొలగించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సినిమాపై నిషేధం విధించారు. ఆయన హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను కూడా భారత్లో బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఆయనతో పాటు పలువురు పాక్ నటీనటులను నిషేధించారు. అంతకుముందు పాకిస్తానీ నటులు మావ్రా హోకేన్, మహిరా ఖాన్ సినిమాలైన 'సనమ్ తేరి కసమ్', 'రయీస్' చిత్రాల పోస్టర్లను సైతం తొలగించారు. కాగా.. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత కోసమే కేంద్రం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.