'నేను రాసేదొకటి.. తీసేదొకటి'.. టాక్సిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..! | old video of Geetu Mohandas talking about Yash Toxic Movie | Sakshi
Sakshi News home page

Toxic Movie: 'నేను రాసేదొకటి.. తీసేదొకటి'.. టాక్సిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Aug 27 2026 6:08 PM | Updated on Aug 27 2026 6:27 PM

old video of Geetu Mohandas talking about Yash Toxic Movie

కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్‌ నుంచి సాంగ్స్‌, ట్రైలర్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయినా కూడా మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. సమ్మర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేసింది.

ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్‌ మూవీకి తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. యశ్ యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కథలో ఎలాంటి బలం లేదని నెటిజన్స్‌ తేల్చేశారు. మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో టాక్సిక్‌ మేకర్స్‌కు బిగ్‌ షాక్ తగిలినట్లైంది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన మూవీ కావడంతో యశ్ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మూవీకి డిజాస్టర్‌ టాక్‌తో డైరెక్టర్ ‍గీతూపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే గీతూ మోహన్‌దాస్ పాత వీడియో నెట్టింట తెగ వైరవుతోంది. గీతూ 2021లో ఈ సినిమా గురించి మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నేను స్క్రిప్ట్ ఒకటి రాస్తాను.. ఇంకొకటి చిత్రీకరిస్తానని ఈ వీడియోలో మాట్లాడింది. నా రచనలో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు.. ఒక స్క్రిప్ట్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి పనిచేస్తున్నప్పుడు పరిస్థితి గందరగోళంగా ఉంటుందని తెలిపింది. కొందరు విమర్శలు చేసి వెళ్లిపోతారు.. కానీ నేను వాటిని పట్టించుకోనని వెల్లడించింది. తన టీమ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటామని గీతూ పేర్కొంది.

ఈ చిత్రాన్ని స్త్రీ దృష్టికోణంతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఆమె అభివర్ణించారు. నేను రాసిన స్క్రిప్టులన్నీ నా సొంతంగానే రాశానని తెలిపారు. నా తర్వాతి సినిమా కోసం రైటర్స్ రూమ్ ఉండటం ఇదే మొదటిసారని అన్నారు. నేను ఒకటి రాస్తాను.. మరొకటి చిత్రీకరిస్తాను.. ఇంకొకటి ఎడిట్ చేస్తాను.. ఆ తర్వాత సినిమా విడుదల అవుతుందన్నారు. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటా.. అందుకే నేను ఎప్పుడూ స్క్రిప్ట్‌కు కట్టుబడి ఉండనని గీతూ మోహన్ దాస్ తెలిపింది. ఈ కామెంట్స్‌ను కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement