మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటేస్ట్ మూవీ దృశ్యం-3. సూపర్ హిట్ సిరీస్లో వచ్చిన మూడో చిత్రం ఈ నెల 21 థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీలో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్గా ఘనత సాధించింది.
ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ మొదటి రోజే మంచి వసూళ్లు సాధించింది. రిలీజైన తొలి రోజే రూ. 15.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 18.37 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో రూ. 25 కోట్లు వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 43.37 కోట్లకు పైగా కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ ఓపెనింగ్ డే వసూళ్లతో మలయాళ సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దృశ్యం-3 రెండోస్థానంలో నిలిచింది. ఈనెల 1వ తేదీన విడుదలై మొదటి రోజు రూ. 28.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన స్పై థ్రిల్లర్ పేట్రియాట్ను అధిగమించింది. ఈ చిత్రంలో మమ్ముట్టి, మోహన్లాల్ నటించారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించారు. మలయాళ సినిమాలో అత్యధిక ఓపెనింగ్-డే రికార్డు వసూళ్లతో 'ఎల్2: ఎంపురాన్' చిత్రం కొనసాగుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 67 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు.
ఇక దృశ్యం సినిమాల విషయానికొస్తే.. 2013లో 'దృశ్యం' రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీ, కన్నడ, తెలుగు, తమిళంతో సహా పలు భాషలతో పాటు సింహళ, చైనీస్ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2021లో 'దృశ్యం 2' నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీని సైతం కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ దృశ్యం సిరీస్ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ కీలక పాత్రల్లో నటించారు.


