మలయాళ ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా సహాయ నటిగా రాణిస్తోంది నటి మంజు పాత్రోస్. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్ చేస్తోంది. కొంతకాలంగా ఆమె తన వర్క్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలుస్తోంది. భర్త సునిచన్తో విడిపోయిందని ప్రచారం జరుగుతోంది.
అవును, విడిపోయాం
తాజాగా ఈ వ్యవహారంపై మంజు పాత్రోస్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చట్టపరంగా విడిపోలేదు కానీ కొంతకాలంగా వేర్వేరుగానే జీవిస్తున్నాం. సునిచన్తో నేను మాట్లాడటం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి నా కొడుకుతో మాట్లాడుతుంటాడు. వాడిని చూసేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు కూడా! దాన్ని నేనేమీ అడ్డుకోను. మేమింకా చట్టపరంగా విడిపోలేదు. అలా అని మళ్లీ కలిసే ఆలోచనలు కూడా చేయడం లేదు.
ఎంతో ఏడ్చా..
ఇతరులకు నచ్చినట్లుగా ఎక్కువకాలం బతకలేం. మనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. వాటిని కూడా గౌరవించాలికదా! ఇకపోతే ఇలా విడిపోతామని ఎన్నడూ అనుకోలేదు. నా భర్త లేకుండా ఎలా బతకాలని ఎంతగానో ఏడ్చాను. ఒంటరిగా ఎలా జీవిస్తానని భయపడ్డాను. కానీ, ఇప్పుడా భయం పోయింది.. చేతిలో డబ్బుంది కాబట్టి నిర్భయంగా జీవిస్తున్నారని మీరంటారేమో! ఇక్కడ విషయం డబ్బు కాదు.. అలాగైతే నా అకౌంట్లో ఇప్పటికీ చాలా తక్కువ మొత్తమే ఉంది.
చిల్లి గవ్వ లేని స్థితిలో..
ఓపక్క అప్పు తీరుస్తున్నాను, మరోపక్క కొడుకును చదివిస్తున్నాను. ఒకానొక సమయంలో ముక్కుపుడక తప్ప నా చేతిలో ఏమీ లేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయాను. అప్పుడు నా చుట్టూ ఉండేవాళ్లు నాకు మద్దతుగా నిలబడ్డారు, సాయం చేశారు అని చెప్పుకొచ్చింది. మంజు మలయాళంలో జిలేబి, కమ్మటిపాదం, స్కూల్ బస్, కల్యాణం, ప్రేమసూత్రం, తోటప్పన్, మై సాంటా, హెవెన్, క్వీన్ ఎలిజబెత్, ఎఎమ్ఐ, భూతకాలం వంటి పలు సినిమాల్లో నటించింది. మలయాళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది.
చదవండి: జూన్లో ధురంధర్ 3? నిజమెంత?


