
అడవుల్లో మహేశ్బాబు కళ్లు దేని కోసమో వెతుకుతున్నాయి. కొందరు నిధి కోసం అంటున్నారు. మరికొందరు ప్రాణం పోసే సంజీవిని తరహా లాంటి మొక్క కోసం అంటున్నారు. ఈ మాటలు మహేశ్బాబు కొత్త సినిమా గురించే. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో మహేశ్బాబు క్యారెక్టరైజేషన్, సినిమా కథ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వస్తుండటం, సినీ ప్రేమికులు వీటిని ఆసక్తికరంగా గమనిస్తుండటం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాకు భారతీయ ఇతిహాసం రామాయణ నేపథ్యం ఉంటుందట.
రామాయణంలో సంజీవని మొక్క కోసం వెతికే హనుమంతుడిని పోలిన లక్షణాలు మహేశ్బాబు పాత్రలో ఉంటాయని ఫిల్మ్నగర్ భోగట్టా. మరి... మహేశ్బాబు అడవిలో దేని కోసం అన్వేషిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరిగింది. తర్వాత బ్రేక్ తీసుకున్నారు.
ఈ వారంలో మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, కాశీ నగరాన్ని తలపించే సెట్ని రెడీ చేయించారని, ఈ సెట్లోనే షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిసింది. రెండు వారాలకు పైగా ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఇక ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.