ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆమె కూతురు అవంతిక పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీని ఖుష్బూ కుటుంబం శుక్రవారం ఢిల్లీలో కలిసింది. తమ కూతురు పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఖుష్బూ- సుందర్ దంపతులు మోదీకి శుభలేఖ అందించారు. ఖుష్బూ దంపతుల వెంట కూతురు అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ సైతం ఉన్నారు. ఈ ఫోటోను ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
మోదీకి రుణపడి ఉంటాం
'నా కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. శ్రవణ్ శ్రీనివాసన్తో జరగబోయే నా కూతురి పెళ్లికి తప్పక హాజరవాల్సిందిగా కోరుతూ శుభలేఖను అందించాను. కాబోయే దంపతులను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. బిజీ షెడ్యూల్లోనూ మోదీ మాకు సమయం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ ప్రధానమంత్రిగారు' అని ఖుష్బూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది.
ఫ్యామిలీ
ఇది చూసిన అభిమానులు ఖుష్బూ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఖుష్బూ- సుందర్ దంపతులకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుర్లు సంతానం. ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అవంతిక యాక్టింగ్పై దృష్టి సారించింది. మలయాళంలో ఆరంభం అనే సినిమాలో నటిస్తోంది.


