
ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘంలో తమిళనాడు తెలుగు యువశక్తి వవస్థాపక అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు. "ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎంతో నష్టపోతుందన్నారు. 2017లోనే బెట్టింగ్ యాప్స్ నిర్మూలణ కోసం తెలంగాణలో ఒక చట్టం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది.
ఆంధ్రప్రదేశ్లో కూడా బెట్టింగ్ యాప్స్ నిర్మూలణ కోసం 2020లో చట్టాలు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రలు చట్టాలు చేసినప్పటికీ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్ను ఆధారం చేసుకుని వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతుందన్నారు. రమ్మీ అనేది స్కిల్ గేమ్ అంటూ ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు చెందిన వారు చెప్పడం.. ఆపై తమ యాప్స్ను ప్రముఖ క్రీడాకారులు, సినీ నటులతో ప్రకటనలు క్రియేట్ చేసి వదులుతున్నారని తెలిపారు. పక్కా ప్లాన్తో ఇలా ప్రజలను లూటీ చేస్తున్నారని చెప్పారు.
ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్లలో దాదాపు 1000 మందికి పైగానే ఆత్మహత్యలు చేసుకున్నరని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న ఈ బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయడమే కాకుండా ఈ మాఫియాను కట్టడి చేయాలన్నారు. అందు కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక నిఘా సంస్థను ఏర్పాటు చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.