
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. రాజకీయ దాడి, ప్రతి దాడులకు చిత్రపరిశ్రమను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు.
‘సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదు.. అందరికీ తెలిసే జరిగింది. తెలుగు చిత్రపరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్రపరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్రపరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారు.
హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని చిత్రపరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని దిల్ రాజు ట్వీట్ చేశారు.
కాగా, ఓ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి కేవలం ప్రచారం కోసమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించాడని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి అసెంబ్లీ అలా మాట్లాడారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లతో సెటిల్ చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు.
— Chairman - Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024