సుశాంత్‌ మృతి కేసులో కీల‌క మ‌లుపు | CBI Issued Summons To Rhea Chakraborty And Her Father | Sakshi
Sakshi News home page

సుశాంత్ ఫ్లాట్‌లో డ‌మ్మీ టెస్ట్ నిర్వ‌హించిన సీబీఐ

Aug 24 2020 1:51 PM | Updated on Aug 24 2020 4:13 PM

CBI  Issued Summons To Rhea Chakraborty And Her Father - Sakshi

సాక్షి, ముంబై :  బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. సుశాంత్‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన‌ట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఏ క్ష‌ణ‌మైనా ఆమెను సీబీఐ అరెస్ట్ చేయ‌నుంద‌ని ప‌లు వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య‌నా లేక హ‌త్య అన్న‌దానిపై సీబీఐ విచార‌ణ కొన‌సాగిస్తుంది. ముంబైలోని సుశాంత్ ఫ్లాట్‌లో సీబీఐ ప్ర‌త్యేక బృందం నేడు డ‌మ్మీ టెస్ట్ నిర్వ‌హించింది. సుశాంత్ ఎత్తు  5 ఫీట్ల 10 అంగుళాలు  కాగా ఫ్యాన్‌కు, బెడ్‌కు మ‌ధ్య 5 ఫీట్ల 11 అంగుళాల ఎత్తు ఉంది. అపార్ట్‌మెంట్లోని రూఫ్ ఎత్తు  9 ఫీట్ల 3 అంగుళాలు ఉన్న‌ట్లు తేలింది. ఈ నేప‌థ్యంలో అస‌లు సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేదా హ‌త్య జ‌రిగిందా అన్న‌దానిపై ఆధారాలు సేక‌రిస్తున్నారు.  (సుశాంత్‌ కేసు: అర్ధరాత్రి దాటిన తర్వాత పోస్ట్‌మార్టం?)

సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డినట్లుగా చెబుతున్న పోస్టుమార్టం రిపోర్టులో ఘ‌ట‌న ఎన్ని గంట‌లకు జ‌రిగిందన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. దీనిపై ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. సుశాంత్ నివాసం నుంచి ద‌గ్గ‌ర్లోనే రెండు హాస్పిట‌ల్స్ ఉన్నా ఐదుకిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కూప‌ర్ హాస్పిట‌ల్‌కే సుశాంత్ డెడ్‌బాడీని ఎందుకు త‌ర‌లించార‌న్న దానిపై కూడా ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సుశాంత్ డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని ఇందుకు సంబంధించి చికిత్స అందిస్తున్నామ‌ని పేర్కొన్న హిందుజా ఆసుపత్రిని సీబీఐలోని మరో బృందం నిన్న సందర్శించింది. ఆ స‌మ‌యంలో సుశాంత్ మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉండేది? అత‌నితో పాటు హాస్పిట‌ల్‌కి ఎవ‌రైనా వ‌చ్చేవారా?  హాస్పిటల్ బిల్లు ఎవరు చెల్లించారు తదితర  విషయాలపై కూడా వారు అధికారులు సమాచారం సేక‌రిస్తున్నారు. ఇక  సుశాంత్ మృతి కేసు   దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. (సుశాంత్‌ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు)

Advertisement
 
Advertisement
Advertisement