మనకు బాగా కావాల్సినవారిని కోల్పోతే ఆ బాధ మాటల్లో వర్ణించలేం. ప్రముఖ నటుడు ఉత్తేజ్ కొన్నేళ్లుగా అదే బాధలో ఉన్నాడు. జీవితాంతం చేయి వదలనని మాటిచ్చిన భార్య మధ్యలోనే ఊపిరి వదిలేయడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఉత్తేజ్ భార్య పద్మావతి 2021లో క్యాన్సర్తో కన్నుమూసింది. తాజాగా పెళ్లిరోజు సందర్భంగా భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు.
మార్గమధ్యంలో చేయి వదిలేశావ్
'పద్దూ, ఈరోజు మన పెళ్లిరోజు. ఇపుడు బాగా గుర్తుంటోంది. అప్పట్లో నీ పుట్టినరోజుని, మన పెళ్లిరోజుని మాత్రం రెండు నెలల ముందునుంచే గుర్తుపెట్టుకొని.. డేట్ వల్లె వేస్తూ ఉండేవాడిని.. ఎక్కడ మర్చిపోతానో అని! ఇది అందరి మొగుళ్లకి అనుభవైకవేద్యమే.. ఎలా ఉన్నావు పద్దూ.. కడదాకా, నే కడతేరే దాకా నా వెంటే ఉంటానన్నావు. మార్గమధ్యంలో చెయ్యి వదిలేశావ్... పట్టు సడలి కిందపడ్డాను.. లేచి చూస్తే నువ్వు లేవు.. పిలిచా, అరిచా, ఏడ్చా.. నువ్వులేవు.
ముందుగా వెళ్తావనుకోలే
ఇంకా వెదుకుతూనే ఉన్నా.. సంతలో తప్పిపోయిన పిల్లాడు అమ్మకోసం వెదుక్కున్నట్టు! తప్పు చేశావు పద్దూ.. నన్ను మరీ డిపెండెంట్ చేశావ్.. అన్నింటికీ తోడున్నావ్.. అన్నింటికీ ముందున్నావు. నేనున్నాను పదయ్య అన్నావు. నేనున్నాగా పర్లేదన్నావ్.. ధైర్యం అయ్యావు. ఆలంబన అయ్యావు. ఆసరా అయ్యావు. ముందుంటావనుకున్నా.. ముందుగా వెళ్తావనుకోలేదు. అన్ని పనులు... భోజనం, ఆలనా పాలనా ఓ మ్యాజిక్లా సాక్షాత్కారమయ్యేవి. తిట్టుకున్నా, అరుచుకున్నా నవ్వుతా.. తుళ్ళుతా ఉండేదానివి.
మిస్ యూ
నాన్నలా భుజం తట్టావు. తిట్టావు కూడా.. అమ్మలా అక్కున చేర్చుకున్నావు.. ఫ్రెండ్లా తోడున్నావు. పాటమ్మకి నిన్ను తెచ్చివ్వలేను, ఆ స్పర్శని అందివ్వలేను, కానీ నీ బాధ్యతని, నీ ప్రేమని అందించే ప్రయత్నం చేస్తున్నా.. నాన్నలా 100% ఉంటాను.. దానికి నేనయినా ఉన్నాను... నాకే ఎవరూ లేరు.. లవ్యూ పద్దూ, నిన్ను చాలా మిస్ అవుతున్నాం' అని రాసుకొచ్చాడు. కాగా ఉత్తేజ్.. మనీ మనీ, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మహాత్మ వంటి పలు చిత్రాలకు సంభాషణలు రాశాడు. హిట్లర్, ప్రేమించుకుందాం రా, అభిషేకం, అన్నయ్య, బద్రి, ఖడ్గం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, జై చిరంజీవ.. ఇలా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.


