చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోయిందని, వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, నార్సింగి బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం నార్సింగి తహసీల్దార్ గ్రేసిబాయికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతుతూ.. కొనుగోలు కేంద్రాల్లో 75 శాతం ధాన్యం ఇప్పటికీ కాంటా వేయకుండా ఉందన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కాంటా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మైలారం నర్సింలు, నాయకులు హరిబాబు, లక్ష్మణ్, శ్రీనివాస్, నరేష్ ఉన్నారు.


