● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
● హాజరుకానున్న 5,194 మంది విద్యార్థులు
● 21 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
మెదక్ కలెక్టరేట్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 5,194 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 21 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ముగ్గురు కస్టోడియన్లు, ముగ్గురు సిట్టింగ్ స్క్వాడ్స్, ప్లయింగ్ స్క్వాడ్ టీం బృందాన్ని నియమించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారిణి మాధవి తెలిపారు. విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామని వివరించారు. పరీక్షలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


