ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్జోన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్స్టేషన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను వివరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా పోలీసులను సంప్రదించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరుగుతోందని ఎస్పీ తెలిపారు.
కౌడిపల్లి(నర్సాపూర్): ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో బ్యాక్లాగ్ ఖాళీల అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందుకు 1250 మంది విద్యార్థులు హాజరయినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ రాజేశం, జిల్లా ఇన్చార్జి హరిబాబు తెలిపారు. సోమవారం కౌడిపల్లి మండలం తునికి ఎంజేపీ బీసీగురుకుల పాఠశాలలో 6,7,8,9వ తరగతిలో బ్యాక్లాగ్ ఖాళీల అడ్మిషన్ల కోసం ఇటీవల ప్రవేశపరీక్ష రాశారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 14బాలురు, 15బాలిక ఎంజేసీ బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా ప్రవేశ పరీక్షలో 1417 మంది విద్యార్థులు మెరిట్ సాధించినట్లు చెప్పారు. ఆయా గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయుల సమక్షంలో కౌన్సిలింగ్కు 1250 మంది విద్యార్థులు హాజరు కావడంతో సీట్లు కేటాయించినట్లు చెప్పారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
మెదక్జోన్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చెప్పిన పలు సూచనలు ప్రతి భారతీయుడు పాటించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, విదేశీ పర్యటనలను తగ్గించడం, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయటం లాంటి సూచనలను పాటించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, జిల్లా నేతలు సత్యనారాయణ, నాగరాజు, నల్లాల విజయ్, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ అధ్యక్షురాలు బాలమణి డిమాండ్
రామాయంపేట(మెదక్): వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురవుతున్నారని, వారితో ఉదయం ఐదు నుంచి 11 గంటల లోపే పనులు చేయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె కార్మికులతో కలిసి మున్సిపల్ చైర్మన్ లావణ్యను కలిసి మాట్లాడారు. ఎండ పెరుగుతున్న క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తమ విధుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. గత నెలకు సంబంధించిన వేతనాలు చెల్లించలేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


