జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
కొల్చారం(నర్సాపూర్): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, గన్నీ బ్యాగుల సరఫరా, కేంద్రాలకు కేటాయించిన లారీలు వస్తున్నాయా? లేదా? అని ఆరా తీశారు. రైతులు నమోదు చేసుకున్న ఓపీ ఎంఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడి కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన 13 లారీల ధాన్యాన్ని, స్థానికంగా ఉన్న రైస్ మిల్లుకు తరలించామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో ధాన్యంతో వస్తే ఎప్పటికప్పుడు అన్లోడింగ్ చేయాలని మిల్లు యజమానులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పీఏసీఎస్ చైర్మన్ మనోహర్, సీఈఓ కృష్ణ, రైతులు ఉన్నారు.


