మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నేటి నుంచి విద్యా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులు ఈనెల 17 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మొదటి రోజు పాఠశాలల్లో పూర్తయిన పనులను ప్రారంభించడంతో పాటు సమ్మర్ క్యాంపుల ప్రారంభిస్తారు. రెండోరోజు పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు రీమిడియల్ క్యాంపులు చేపడుతారు. వీటిని ఏడీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. సబ్జెక్టులపై నిపుణులతో బోధన ఉంటుంది. హాజరు తీరుపై అవగాహన, విద్యార్థుల ప్రగతిపై సమీక్ష చేపడుతారు. అలాగే మధ్యాహ్న భోజనం తీరును పరిశీలిస్తారు. ఇక మూడో రోజు ఆయా పాఠశాలల పరిధిలోని ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. పలు రకాల కిట్ల పంపిణీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.25 వేలు మంజూరు చేసింది.
4వ రోజు బడిబాట
విద్యావారోత్సవాల్లో భాగంగా ఈనెల 14న పెద్ద ఎత్తున బడిబాట ర్యాలీలు నిర్వహిస్తారు. ఉపాఽ ద్యాయులు, అధికారులు ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను బడిలో చేర్పిస్తారు. అలాగే తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తారు. 5వ రోజు గ్రంథాలయ దినోత్సవం నిర్వహిస్తారు. ఉత్తమ పాఠకులను గుర్తించి ప్రోత్సహిస్తారు. అలాగే పుస్తక దాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 6వ రోజు విద్యార్థులకు చిత్రలేఖనం, హస్తకళల పోటీలు నిర్వహిస్తారు. కోలాటం, ఒగ్గుకథ వంటి సాంప్రదాయ కళల ప్రదర్శనలు చేపడుతారు. 7వ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరిస్తారు. ఇదే విషయమై డీఈఓ రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈనెల 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు


