రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత
ఉమ్మడి జిల్లా అధికారులతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత
మెదక్ కలెక్టరేట్: బాలల హక్కులను కాలరాస్తే సహించేది లేదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీత హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలల హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. చిన్నారులు మన సమాజానికి భవిష్యత్ అని, వారి శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి అనుకూల వాతావరణం కల్పించడం అత్యవసరమన్నారు. మెదక్లోని మాతా శిశు కేంద్ర ఆస్పత్రిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని డాక్టర్ సునీతాదేవి చెప్పగా, వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే సిద్దిపేటలోని కేజీబీవీలో నెలకొన్న మరుగుదొడ్ల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, వారికి అందాల్సిన పరిహారం గురించి మీరేం చేస్తున్నారని ఉమ్మడి జిల్లా కార్మిక అధికారిని ప్రశ్నించారు. కాగితాల్లో చూసి చెప్పడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో బాలల రక్షణ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యు లు వందనాగౌడ్, చందన, సరిత, అపర్ణ, అగర్వాల్, వచన్ కుమార్ సిద్దిపేట డీఆర్ఓ నాగరాజమ్మ. మెదక్ ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సిద్దిపేట అదనపు ఏసీసీ నర్సింలు, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.


