తూప్రాన్: జ్యువెలరీ షాపుల యజమానులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బంగారం షాపుల యజమానులు, పాన్ బ్రోకర్లు, గోల్డ్ వ్యాపారులు, బ్యాంకు అధికారులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాలు, దోపిడీలు, మోసాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు హై క్వాలిటీతో ఏర్పాటు చేసి, నిరంతర రికార్డింగ్, బ్యాకప్ ఉండేలా చూడాలన్నారు. అలాగే అలారం సిస్టమ్, సేఫ్టీ లాకర్స్ వినియోగం పెంచాలన్నారు. ముఖ్యంగా దుకాణాల్లోకి వచ్చే కస్టమర్ల వివరాలను నమోదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగకృష్ణ, ఇతర పోలీస్ అధికారుల పాల్గొన్నారు.
బంగారం వ్యాపారులకు ఏఎస్పీ సూచన


