పెద్దశంకరంపేట(మెదక్): రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొప్పోల్ ఉమాసంగమేశ్వర దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శకుంతల, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, సర్పంచ్ పోచమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్
బాధ్యతల స్వీకరణ
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్గా సాయికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన శ్రీరాంచరన్రెడ్డి గత నెలలో బదిలీ కావడంతో జిన్నారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గ్రూపు–1 అధికారి సాయికుమార్ను ప్రభుత్వం ఇటీవల నియమించింది.
కాంగ్రెస్ ఖాతాలో కో ఆప్షన్
రామాయంపేట(మెదక్): కో ఆప్షన్ ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. నాలుగు పదవులకు నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవం అయింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత పాల్గొన్నారు. సభ్యులుగా చింతల రాధాభవాని, దేమె యాదగిరి, మహ్మద్గౌస్, ఆసియా సుల్తానా ఎన్నికై నట్లు మున్సిపల్ కమిషన్ గణేశ్రెడ్డి ప్రకటించారు. అనంతరం వారు ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా వారికి ఎమ్మెల్యే ఎన్నికపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రఘువరణ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవేం మెడికల్ బిల్లులు?
మెదక్జోన్: మెడికల్ బోర్డు మంజూరు చేసిన బిల్లులను పునర్ పరిశీలించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తపస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లం డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం యూనియన్ నేతలతో కలిసి అదనపు కలెక్టర్ నగేశ్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులు మెడికల్ బిల్లులకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 10 శాతం కూడా విడుదల చేయలేదని వాపోయారు. అనేక మందికి తక్కువ బిల్లులు మంజూరు అయ్యాయన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని, మళ్లీ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో తపస్ నేతలు సిద్దూ, చల్లా లక్ష్మణ్, సురేందర్, రవి, ఆంజనేయులు, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పోలీస్ యాక్ట్
మెదక్జోన్: శాంతి భద్రతల పరిరక్షణలో భా గంగా ఈనెల 31 వరకు జిల్లాలో పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకో, నిరసన, ర్యాలీ, పబ్లిక్ మీటింగ్లు నిర్వహించడం నిషేధమన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు, అశాంతికి ప్రయత్నాలు చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


