నేటి నుంచి అంగన్వాడీలకు వేసవి సెలవులు
● టేక్ హోం రేషన్ విధానం అమలు ● చిన్నారుల ఆరోగ్య స్థితుగతులపైన టీచర్ల పర్యవేక్షణ
ఎండలు మండుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరు శాతం తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం లబ్ధిదారులకు అంగన్వాడీ సరుకులను ఇంటికే పంపించాలని నిర్ణయించింది. నేటి నుంచి ఈనెల 31 వరకు ఈ విధానాన్ని అమలు చేయనుంది. జూన్ 1 నుంచి యథావిధిగా కేంద్రాలను ప్రారంభించనుంది.
– రామాయంపేట(మెదక్)
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్రాల్లో చాలా చోట్ల ఫ్యాన్లు లేకపోవడం, ఉన్నవి కూడా సరిగా పనిచేయకపోవడంతో ఉక్కబోతతో అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంఖ్య తగ్గింది. కొన్ని రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు నిర్వహించారు. ఈక్రమంలో మే 1 నుంచి 31 వరకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా సెలవు రోజుల్లో టేక్ హోం రేషన్ (టీహెచ్ఆర్) కింద ఇళ్ల వద్దకే సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీచర్లు చేయాల్సిన పనుల విషయమై దిశానిర్దేశం చేసింది.


