మెదక్ కలెక్టరేట్: పసిబిడ్డలు వద్దనుకునే వారు ఊయలలో వేయాలని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్ సూచించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఊయలను ఏర్పాటు చేయగా, ప్రారంభించి మాట్లాడారు. ఎవరికై నా చిన్న పిల్లలు భారం అనుకుంటే ముళ్ల పొదలు, చెత్త బుట్టలలో వేయకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో వదిలి వేయాలన్నారు. ఆ పిల్లల సంరక్షణ బాధ్యతను అధికారులు తీసుకుంటారని తెలిపారు. ఊయలలో వేయలేని వారు మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించాలన్నారు. లేదంటే 1098కు సమాచారమిస్తే అధికారులు వచ్చి పిల్లలను తీసుకెళ్తారని వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అనీష్ ఫాతిమా, ఆర్ఎంఓ రేవతి, హెచ్ఓడీ, గైనకాలజిస్ట్ రాజేశ్వరీ, మెదక్ సీడీపీఓ వెంకటరమణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, మాధవి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


