ఎమ్మెల్యే సునీతారెడ్డి
కొల్చారం(నర్సాపూర్): ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని రంగంపేట, దుంపలకుంట చౌరస్తాలో చలివేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు సరిపోను లేవన్నారు. ధాన్యం రవాణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. ప్రధానంగా ధాన్యం లోడింగ్ చేసిన తర్వాత, లారీ ఏ రైస్మిల్కు వెళ్తుందన్న విషయమై రైతులకు చివరి వరకు తెలియడం లేదన్నారు. నిబంధనల పేరిట అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి, సజావుగా కొనుగోళ్లు, రవాణ జరిగేలా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన రంగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని స్పందనను అభినందించారు. ఆమె వెంట తుక్కాపూర్, పైతర సర్పంచ్లు ఆంజనేయులు, రవితేజరెడ్డి, నాయకులు మల్లేశం, రాజా సంతోష్ కుమార్ ఉన్నారు.


