పూర్తిస్థాయిలో ప్రకటించని పార్టీలు
● జాగ్రత్త పడుతున్న నేతలు ● ప్రచారం ప్రారంభించిన పలువురు
మెదక్జోన్: ‘పుర’పోరులో భాగంగా మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగగా, శనివారం అధికారులు స్క్రూట్నీ నిర్వహించారు. ఇందులో అన్నీ సక్రమంగానే ఉన్నట్లు తేల్చారు. కాగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఇప్పటివరకు ఏ పార్టీ పూర్తిస్థాయిలో ఖరారు చేయలేదు. అయితే నామినేషన్ వేసిన ఆశావహులు మాత్రం ప్రచారం మొదలు పెట్టారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులకు గానూ 519 మంది ఆశావహులు 668 నామినేషన్లు దాఖలు చేశారు. కాగా కొందరు ఒక్కొక్కరు రెండు, మూడు చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈనెల 3వ తేదీ వరకు విత్డ్రాకు సమయం ఉంది. అదేరోజున అభ్యర్థుల జాబితా ఫైనల్ చేసి బీఫాంలు అందించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే సర్వే చేయించారు. దాని ఆధారంగానే టికెట్లు కేటాయిస్తునట్లు సమాచారం. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 28 మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలిసింది. మరో నలుగురి పేర్లు ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ 24 పేర్లు ఖరారు చేయగా, మరో 8 మంది పేర్లు ఫైనల్ చేయాల్సి ఉంది. బీజేపీ నాలుగు మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే వారి పేర్లు ఖరారు చేసింది. బీఫాంలు సైతం రాష్ట్ర పార్టీ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఖరారైన అభ్యర్థుల పేర్లు మాత్రం బయట పెట్టడం లేదు. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేయగా, అధికార కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. తూప్రాన్, రామాయంపేటలో ఇప్పటివరకు ఏ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదు.
రెబల్స్ బెడద
అభ్యర్థులను ప్రకటించే విషయంలో అన్ని పార్టీలు జాగ్రత్తలు వహిస్తున్నాయి. పేర్లు బయటపెడితే ఇప్పటికే టికెట్ ఆశించిన వారి పేరు జాబితాలో లేకుంటే వారు పార్టీ మారినా..? లేక రెబల్గా బరిలో నిలిచినా పార్టీకి తీరని నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ఈనెల 3లోగా ఫైనల్ అయిన అభ్యర్థులకు బీఫాంలను నేరుగా మున్సిపల్ అధికారులకే అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నామినేషన్ దాఖలు చేసిన చాలా మంది ఆశావహులు ఇంటింటి ప్రచారం చేస్తూ మద్దతు కూడగడుతున్నారు.


