కూరగాయల సాగుకు పెద్దపీట
ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా పూర్తి సబ్సిడీతో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా కూరగాయల విత్తనాలతో పాటు నారుమళ్లను అందిస్తుంది. దీంతో జిల్లాలో రైతులు కూరగాయల
సాగుకు మొగ్గు చూపుతున్నారు.
– మెదక్జోన్
జిల్లావ్యాప్తంగా ఏటా 1,500 ఎకరాల నుంచి 2 వేల ఎకరాలు మాత్రమే కూరగాయల సాగు చేస్తారు. ఇందులో పండించిన పంట ఉత్పత్తులు జిల్లాకు సరిపడక ఇతర జిల్లాల నుంచి కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారులు ఇష్టారీతిగా ధరలను పెంచుతున్నారు. నాణ్యమైన కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది. కాగా ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో విత్తనాలతో పాటు నారును అందించి కూరగాయల సాగుకు పెద్దపీట వేస్తోంది. గత కొనేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గింది. కాగా ఈ ఏడాది జిల్లాలో 400 ఎకరాల్లో సాగు చేసేందుకు విత్తన కిట్లను రైతులకు అందిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్లో 6 నుంచి 8 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ విత్తనాలతో అర ఎకరంలో సాగు చేయవచ్చు. ఈ కిట్టులో టమాట, బీర, చిక్కుడు, పాలకూర, బెండ, కాకరకాయ లాంటి విత్తనాలు ఉన్నాయి. వీటిని గత పది రోజులుగా జిల్లాలో పంపిణీ చేస్తున్నారు. అ లాగే ములుగు విత్తన కేంద్రం ద్వారా జిల్లాకు 250 ఎకరాలకు సరిపడా కూరగాయల నారుమళ్లను సైతం పూర్తి సబ్సిడీపై అందిస్తున్నారు.
8 రకాల విత్తనాలకు సంబంధించిన కిట్లు పంపిణీ
జిల్లాలో 650 ఎకరాల్లో సాగుకు యోగ్యం
భారీగా పెరగనున్న సాగు!
వందశాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాలతో పాటు నారుమళ్లను అందిస్తుండటంతో కూరగాయల సాగు జిల్లాలో భారీగా పెరగనుంది. ఇప్పటికే జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేయగా, విత్తనాల రూపంలో 400 ఎకరాలకు సడిపడా కిట్లను అందిస్తున్నారు. నారుమళ్లు మరో 250 ఎకరాల వరకు ఇస్తుండగా జిల్లాకు మొత్తం సబ్సిడీ రూపంలో 650 ఎకరాల్లో కూరగాయల సాగుకానుంది. కాగా జిల్లాలో ఈఏడాది 2,650 ఎకరాల్లో కూరగాయల సాగు కానుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.


