
దర్జాగా దగా
సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం ఖాతరు చేయడంలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ మిల్లర్లు మొండికేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరాడించి సివిల్సప్లైకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బియ్యాన్ని కాజేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా 13 మంది మిల్లర్ల యాజమాన్యాలు 61వేలకుపైగా మెట్రిక్టన్నుల బియ్యం ఎగ్గొట్టారు. వీటి విలువ రూ. 214 కోట్లు. రికవరీ కోసం ఆర్ఆర్యాక్టు ప్రయోగించినా వసూళ్లు కాకపోవడం గమనార్హం. – మెదక్జోన్
మెదక్ జిల్లాలో గత తొమ్మిదేళ్లు(వానాకాలం, రబీ)గా 13 రైస్ మిల్లర్లు 61,786.193 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడ్డారు. వీటికి సంబంధించి జరిమానా, వడ్డీ కలిపి మొత్తం రూ.214.15 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీటి రికవరీ కోసం ఆర్ఆర్ యాక్టు ప్రయోగించినా పెద్దగా ఫలితం లేదని తెలిపారు.
రికవరీ చేయకుండానే కేటాయింపులు
బకాయి పడిన మిల్లర్ల నుంచి పూర్తిగా బియ్యం రికవరీ చేశాకే మళ్లీ ధాన్యాం కేటాయించాల్సి ఉంది. కానీ అవేం నిబంధనలు పట్టించుకోకుండా తొమ్మిదేళ్ల పాటు వానాకాలం, రబీ సీజన్లలో 18 సార్లు బకాయిపడిన మిల్లులకు ధాన్యం కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో ఉన్న నేతల ఒత్తిడి ఏమైనా ఉందా? లేకా మరేకారణాలు ఉన్నాయో తెలియదుకానీ వందల కోట్ల విలువైన బియ్యాన్ని 13 మంది మిల్లర్లు బొక్కడం గమనార్హం.
ఒకే మిల్లు వద్ద రూ.4 కోట్ల బియ్యం బకాయి
పాపన్నపేటకు చెందిన ఒక రైస్ మిల్లు.. 2012 నుంచి 2016 వరకు వానాకాలం, యాసంగిలో 70.128 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడింది. ఇందుకు సంబంధించి జరిమానా, వడ్డి కలిపి ఆ బియ్యం విలువ రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు మిల్లర్ యజమాని ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో దర్జాగా విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్ఆర్యాక్టు ప్రయోగం
తొమ్మిదేళ్లుగా 61,786 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి పడిన 13 మంది మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం. అయినా స్పందించక పోవటంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఆర్ఆర్యాక్టు ప్రయోగించాం. రికవరీకి చేర్యలు చేపడుతున్నాం.
– జగదీశ్కుమార్, డీఎం సివిల్సప్లై
తొమ్మిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం ఎగవేత
రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం
61,786 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి
పెనాల్టీతో వీటివిలువ రూ.214 కోట్లు
క్రిమినల్ కేసులు నమోదు