
పోలింగ్ కేంద్రాల పరిశీలన
నిజాంపేట(మెదక్): స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిజాంపేట మండలంలోని సమస్యాత్మకమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చల్మెడ, కల్వకుంట, నార్లాపూర్ గ్రామాలల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఆయనతో పాటు రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, నిజాంపేట ఎస్ఐ రాజేశ్, ఎంపీడీఒ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.
మెరుగైన బోధన చేయాలి
డీఈఓ రాధాకిషన్
శివ్వంపేట(నర్సాపూర్): చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులు సూచించారు. మంగళవారం మండలంలోని చండి, దొంతి, కొంతంపల్లి, దంతాన్పల్లి పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులతో చేతిరాత రాయించడంతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అకాడమిక్ మానిటర్ అధికారి సుదర్శన మూర్తి, నవీన్, రాజు సీఎస్ఎఫ్ ఫౌండేషన్ సభ్యులు సిరి ఆదిత్య, ఎంఈఓ బుచ్చా నాయక్ పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ
ఉపాధ్యాయుడిగా రవిబాబు
చేగుంట(తూప్రాన్): చేగుంటలోని మోడల్ పాఠశాలలో పని చేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రవిబాబుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వరించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. జాతీయ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన కార్మక్రమంలో రవిబాబుకు అవార్డు అందుకున్నారని చెప్పారు. కాగా, రవిబాబుకు అవార్డు రావడం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
నేషనల్ చాంపియన్షిప్కు ఎంజేపీ విద్యార్థి
హవేళిఘణాపూర్(మెదక్): మహాత్యాజ్యోతిరావుపూలె బాలుర రెసిడెన్షియల్ హవేళిఘణాపూర్ విద్యార్థి జశ్వంత్ నేషనల్ –2025 చాంపియన్షిప్కు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ సృజన మంగళవారం తెలిపారు. ఎంజేపీ బాలుర పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి జశ్వంత్ అక్టోబర్ చివరి వారంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగే నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొననున్నాడని పేర్కొన్నారు. నేషనల్ లెవెల్ చాంపియన్షిప్కు ఎంపిక కావడం పట్ల పాఠశాల అధ్యాపకులు సంతోశ్, విద్యార్థులు తదితరులు అభినందించారు.