
సాయుధ కారాగారంలో ఆయుధపూజ
సంగారెడ్డి జోన్: జిల్లా పోలీస్ సాయుధ కారాగారంలో ఆయుధ పూజను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుర్గాష్టమి పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయుధాలతోపాటు వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణలో విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం అయ్యేందుకు దుర్గామాత కరుణ, కటాక్షాలు పోలీసులపై ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు (అక్టోబరు 1వ తేదీ నుంచి 31 వరకు) 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని చెప్పారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగసభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్