
‘బడిబాట’కు సన్నద్ధం
పాపన్నపేట(మెదక్): జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కోసం విద్యాశాఖ సన్నద్ధం అవుతుంది. పండగ వాతావరణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రైవేట్, బడిబయట పిల్లలే లక్ష్యంగా నమోదు కార్యక్రమం చేపట్టనుంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా.. తల్లిదండ్రులను ఆకట్టుకునేలా చదువుల పండగ కొనసాగనుంది. ఇప్పటికే అన్ని పాఠశాలలను ఆధునీకరించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ బోధనలకు అనుకూలంగా క్లాస్ రూంలు తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో 876 ప్రభుత్వ పాఠశాలలుండగా, 61,533 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా కొన్ని గ్రామాల్లో టీచర్లు ముందస్తు బడిబాట ప్రారంభించారు.
ప్రభుత్వ బడుల బలోపేతం
ప్రభుత్వ బడిని బతికించుకునే దిశగా విద్యాశాఖ భగీరథ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పభుత్వ బడులను పరిపూర్ణ వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. ప్రైవేట్కు ధీటుగా డిజిటల్ క్లాసులు ప్రారంభించింది. 50 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ, ఏఎక్స్ఎల్ ల్యాబ్లు ఆరంభించింది. డిజిటల్ పాఠాల కోసం ఇప్పటికే 176 పాఠశాలల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ సర్వీసుల సౌకర్యం కల్పించగా, మరో 300 పాఠశాలల కోసం ప్రతిపాదనలు పంపారు. ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) బోర్డులతో బోధన కొనసాగిస్తున్నారు. ఈఏడాది ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్తో సైన్స్, గణితం పాఠాలు బోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని బడులకు కలర్లు వేశారు. ప్రతి పాఠశాలకు ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు పంపిణీ చేశారు. కనీస సామర్థ్యాల సాధన దిశగా ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమాలు ఇలా..
జూన్ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం.
7న టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించడం.
8, 9, 10 తేదీల్లో కరపత్రాల పంపిణీ, డ్రాపౌట్ పిల్లల గుర్తింపు.
11న అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష.
12న పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ
13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహణ
16న తరగతి గదుల్లో అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లు వేసి, పిల్లలు తయారు చేసిన చార్టులు ప్రదర్శించాలి. ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు పెట్టాలి.
17న సమీకృత విద్య, బాలికా విద్యా దినోత్సవం నిర్వహణ
18న తల్లిదండ్రులకు తరగతి గదుల డిజిటలీకరణ, ఆధునిక సౌకర్యాలు చూపాలి
19న బడిబాట ముగింపు, విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణ
జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహణ
కార్యాచరణ రూపొందించిన విద్యాశాఖ
జిల్లాలో 876 పాఠశాలలు,
61,533 విద్యార్థులు
సర్కారు బడికి పంపండి
రూ. వేలు పోసి చదువులు కొంటారా..! ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారా !! తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. సర్కార్ బడికి పంపండి మీ పిల్లల భవిష్యత్, బాధ్యత మాది. ఆధునిక పద్ధతుల్లో డిజిటల్ విద్యను, ఏఐ టెక్నాలజీతో జోడించి, విలువలు గల చదువులు నేర్పి, బంగారు భవిష్యత్ను ఇస్తాం. స్థాయికి తగిన సామర్థ్యాలను నేర్పుతాం. 1 నుంచి 10 వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. క్వాలిఫైడ్ టీచర్లతో ఉత్తమ బోధన అందిస్తాం. – రాధాకిషన్, డీఈఓ

‘బడిబాట’కు సన్నద్ధం