
కేతకీలో కోటి జపయజ్ఞం
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో ఆలయ ఆవరణలో విశ్వ మానవ ధర్మ ప్రచారం పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం శివ మంత్ర కోటి జపయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో ‘దేశ రక్షణ–ధర్మ శిక్షణ’సంకల్పంతో యజ్ఞం, పూర్ణాహుతి, మహా మంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి గిరి మహారాజ్, ధనసిరి పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య మహాస్వామి, రంజోల్ రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాజయ్య స్వామి, కేతకీ ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, మాజీ చైర్మన్ నీల వెంకటేశం, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.