జన్నారం: మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన ముదేళ్ల మహేశ్ (35) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపిన వివరాలు.. గురువారం మధ్యాహ్నం మహేశ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో పడగా ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగి మృతి చెందాడు. సమీపంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి అన్న ముదేళ్ల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు.
టిప్పర్ ఢీకొట్టి ఒకరు..
భైంసాటౌన్: మండలంలోని ఎగ్గాం గ్రామానికి చెందిన కోర్వ శివయ్య (53) గురువారం టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని చెరువు వద్దకు శివయ్య బైక్పై వెళ్లాడు. చెరువు నుంచి మట్టి తరలిస్తున్న టిప్పర్ డ్రైవర్ శివయ్యను గమనించకుండా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సుప్రియ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వడదెబ్బతో ఒకరు..
జన్నారం: మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన ఎల్పుల పోషం (57) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. మృతుని తండ్రి ఎల్పుల ఏసు తెలిపిన వివరాల ప్రకారం మూడు రోజుల క్రితం పోషం వడదెబ్బకు గురి కాగా జన్నారంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో, మంచిర్యాలలోని ఆసుపత్రులలో చికిత్స చేయించి బుధవారం ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలో గురువారం ఉదయం పోషం వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. మృతుడికి భార్య మణెమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
చెన్నూర్: ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం బక్రీద్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ఎంపీ వెంకటస్వామి నుంచి నేటి వరకు తమ కుటుంబం ముస్లిం సంప్రదాయాలను గౌరవిస్తుందన్నారు. ముస్లీం మైనార్టీల అభివృద్ధి కోసం రూ.50 లక్షల నిధులతో మైనార్టీ ఫంక్షన్ హాల్ అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు 400 కుట్టుమిషన్లు అందజేయనున్నట్లు తెలిపారు. రూ. 200 కోట్ల నిధులతో చెన్నూర్ మండలం సోమన్పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. మైనార్టీ పాఠశాలను ఎక్కడికి తరలించడం లేదని, చెన్నూర్లోనే ఉంటుందని ఈసందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఫయాజ్, బషీరో ద్దిన్, కౌన్సిలర్లు అమీనోద్దిన్, నజ్మాఅమేశ్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఖలీల్,మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్కుమార్ ఉన్నారు.


