నస్పూర్: సింగరేణి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతి నిధ్య సంఘం ఐఎన్టీయూసీ విఫలం అయ్యాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి ఆరోపించారు. ఆదివారం యూనియన్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యంతో కనీసం స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు చేసుకోలేని దీనస్థితిలో గుర్తింపు సంఘం ఉందన్నారు. మొదటి స్ట్రక్చర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయించలేని స్థితిలో ఉందన్నారు. 14 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. మెడికల్బోర్డు నిర్వహణ తేదీని వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న సుమారు రూ.53 వేల కోట్లను వెంటనే తిరిగి తీసుకురావాలని, డిపెండెంట్లకు నియామక పత్రాలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అపరిష్కృత సమస్యల పరిష్కారానికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఎప్పుడు సమ్మెకు పిలుపునిచ్చినా మద్దతుగా సమ్మెలో పాల్గొంటామన్నారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, అవినాష్రెడ్డి, మహిపాల్రెడ్డి, రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.


