అటు జనగణన విధులు.. ఇటు విద్యావారోత్సవాలు తల పట్టుకుంటున్న ఉపాధ్యాయులు విద్యాశాఖ ఉత్తర్వులు వివాదాస్పదం విద్యార్థుల ఎన్రోల్మెంట్పై టార్గెట్
మంచిర్యాలఅర్బన్/లక్ష్మణచాంద: సర్కారు బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఏటా విద్యాశాఖ ని ర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం–అమలు ప్రణాళిక(2026–27)పై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 14 నుంచి జూన్ 19వరకు బడిబాట నిర్వహించి బడీడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఓ వైపు జనగణన విధులు.. మరోవైపు బడిబాటలో విద్యావారోత్సవాల నిర్వహణపై ఉపాధ్యాయులు తల పట్టుకుంటున్నారు. జనగణన విధులకు ఎంపిక కాని ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొనాలంటూ శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులతోపాటు సీనియర్ ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉండగా.. ఉపాధ్యాయులంతా జనగణన విధుల్లో ఉండగా బడిబాట ఎలా కొనసాగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
టీచర్లంతా జనగణన విధుల్లోనే..
మంచిర్యాల జిల్లాలో 709 పాఠశాలల్లో 43,072 విద్యార్థులు చదువుతుండగా 2,755 మంది టీచర్లు బోధిస్తున్నారు. పాఠశాలలో హెడ్మాస్టర్, సీనియర్ ఉపాధ్యాయుడు మాత్రమే ఉండగా మిగతా వారందరికీ విధులు కేటాయించారు. టీచర్లు సరి పోకపోవడంతో కోటపల్లి మండల నుంచి ఉపాధ్యాయులకు మంచిర్యాల పట్టణంలో విధులు కేటాయించారు. దివ్యాంగ ఉపాధ్యాయులకు విధులు కేటాయించలేదు. కొన్ని చోట్ల సీనియర్ ఉపాధ్యాయులకు కూడా జనగణన విధులు వేశారు. ప్రధానోపాధ్యాయులు మాత్రం పాఠశాలకు పరిమితం అయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం నుంచి తదితర సమాచారం కోసం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఎంపీపీఎస్ 132, జీపీఎస్ 4, ఎంపీయూపీఎస్ 5, టీడబ్ల్యూపీఎస్ 46 మంది ఏకోపాధ్యాయ టీచర్లున్నారు. వీరందరూ జనగణనలో ఉంటే బడిబాట ఎలా సాగుతుందో అధికారులకే తెలియాలి.
గందరగోళం..
ఈ ఏడాది బడిబాటపై గందరగోళం నెలకొంది. ప్రతియేటా జూన్ 6నుంచి 19వ వరకు పక్షం రోజు లపాటు కొనసాగుతుండగా ఈసారి 14 నుంచి జూ న్ 19వరకు బడిబాట కార్యక్రమం చేపట్టడంపై పెదవి విరుస్తున్నారు. 14న తల్లిదండ్రుల సమావే శం, 21న అంగన్వాడీ టీచర్లు, మదర్స్ కమిటీ సమావేశాలు, 28న యువత, స్థానిక నాయకులతో సమావేశం, మే 31న యూనిఫారాలు, పాఠ్యపుస్తకా లు, నోట్బుక్స్ల పంపిణీ, జూన్ 3నుంచి 19వరకు రెగ్యులర్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు వ చ్చాయి. జూన్ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యా లీ, 5న సీఎస్డబ్ల్యూఎన్ పిల్లల గుర్తింపు, 6న బడిబయట పిల్లల గుర్తింపు, 8నుంచి 10వరకు ఇంటింటా ప్రచారం, 12న వెల్కమ్ డే, 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్ఎల్ఎల్ డే, 17న గర్ల్స్ చిల్డ్రన్స్ డే, 18న డిజిటల్ అవర్నెస్ డే, 19 స్పోర్ట్స్ నిర్వహించాలని సూచించారు. గత సంవత్సరంతో పోల్చితే కనీసం 10శాతం నమోదు సాధించాలని టీచర్లకు లక్ష్యం విధించారు. జనగణన జూన్ 9వరకు కొనసాగుతుండగా బడిబాట నిర్వహణ కూడా టీచర్లకు కత్తిమీద సాములా మారింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది 2026–27లో ఎన్రోల్మెంట్ టార్గెట్ విధించారు. ఇది ఎలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యం చేరేందుకు చర్యలు
బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ జిల్లాకు ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి కలెక్టర్ భవేష్ మిశ్రా సూచనల మేరకు అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఆయా మండలాల వారీగా బడి బయట పి ల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నం చేస్తున్నాం.
– భోజన్న, డీఈవో, నిర్మల్
ఉమ్మడి జిల్లా వారీగా లక్ష్యం ఇలా..
జిల్లా పాఠశాలలు 2025–26 2026–27 ఎన్రోల్మెంట్ లక్ష్యం
ఆదిలాబాద్ 693 57,896 64,018
ఆసిఫాబాద్ 704 40,531 44912
నిర్మల్ 713 47969 53100
మంచిర్యాల 709 43072 47715


