మంచిర్యాలటౌన్: జిల్లాలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే 108సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం 108 సిబ్బందితో వడదెబ్బపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరైనా వడదెబ్బ బారిన పడి స్పృహ కోల్పోతే అంబులెన్స్ వచ్చే వరకు చల్లటి ప్రదేశంలో ఉంచి, శరీరాన్ని తడి బట్టతో తుడవాలని కోరారు. 108 వాహనాల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బి.సామ్రాట్ మాట్లాడుతూ జిల్లాలో 18 అంబులెన్స్లు, వడదెబ్బకు గురైన వారికి అవసరమైన ఐస్ప్యాక్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


