నిర్మల్ఖిల్లా:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండగా మధ్యాహ్న సమయాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లాలోని మావల ప్రాంతంలో అత్యధికంగా 44.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని మామడలో 44.6 డిగ్రీలు, కుమురంభీం జిల్లాలోని పెంచికల్పేట్లో 43.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులపాటు కూడా ఇదే తరహాలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వేడి తీవ్రత దష్ట్యా ప్రజలు ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, తలకు గుడ్డ లేదా టోపీ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


