బాసర: బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసాదం ధరలు పెరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అభిషేకం లడ్డూ ధరను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.100గా ఉన్న 500 గ్రాముల లడ్డూ ధరను రూ.150కి పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.
ముడిసరుకు ధరల పెరుగుదలతో..
ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, ఇతర ముడిసరుకుల ధరలు మార్కెట్లో భా రీగా పెరగడంతో, ఆలయ నిర్వహణ భారంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలను పెంచక తప్పలేదని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
భక్తుల నుంచి మిశ్రమ స్పందన..
లడ్డూ ధరను 50శాతం పెంచడంపై భక్తుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సా మాన్య భక్తులపై భారం పడకుండా చూడాలని కొందరు కోరుతుండగా, నాణ్యమైన ప్రసాదం అందించే క్రమంలో ఈ పెంపు అనివార్యమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ కమిటీలో నంది రామయ్యకు చోటు
ఆదిలాబాద్టౌన్: ఏఐయూకేఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య జాతీయ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు టేకం అయు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్ సింగ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి సాయికుమార్, ముత్యాలరావు బుధవారం మాట్లాడారు. రైతాంగ సమస్యలపై నంది రామయ్య నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు.


