నార్నూర్: పెళ్లి వేడుక ముగిసి అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ప్రకృతి కన్నెర్ర జేసింది. ఒక్కసారిగా వీచిన సుడిగాలి కూలీ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నార్నూర్ మండల కేంద్రంలోని విజయ్నగర్ కాలనీలో మంగళవారం ఓ పెళ్లి (టీలా) వేడుక ఘనంగా జరిగింది. అమృత్ మోటే టెంట్హౌస్లో కూలీగా పనిచేస్తున్న మాలేపూర్ గ్రామానికి చెందిన భాగ్యవన్ నిఖిల్ (28) మరో నలుగురితో కలిసి మధ్యాహ్నం టెంట్ తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో భారీ సుడిగాలి వీయడంతో పైనున్న విద్యుత్ తీగలకు పైపు తాకడంతో షాక్కు గురైన నిఖిల్ కిందపడిపోయాడు. మరో కూలీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిఖిల్ను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై గణపతి తెలిపారు.


