ఆదిలాబాద్రూరల్: హనుమకొండలో ఈ నెల 17న నిర్వహించనున్న తుడుందెబ్బ ఐక్యత మహాసభ విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాం రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ కోరారు. మంగళవారం చించుఘాట్లో గ్రామ పటేల్ కుమ్ర రాజు, సార్మేడి ఆత్రం పరుశురాం అధ్యక్షతన గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని తుడుందెబ్బ ఉద్యమ శక్తులన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి ఆదివాసీ హక్కులను పోరాడి సాధించుకోవాలన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను వెంటనే తొలగించాలన్నారు. జీవో 49 శాశ్వతంగా రద్దు చేయాలని, ఫారెస్ట్ అధికారులు కోర్ ఏరియా, బఫర్ ఏరియా పేరుతో ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకోవడం ఆపాలని, 1/59, 1/63, 1/70, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పుస్నక్ భాస్కర్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్క శేషారావు, తుడుందెబ్బ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వేడమ ముకుంద్రావు, మెస్రం తులసీరాం పటేల్, సెడ్మకి రాము పటేల్ పాల్గొన్నారు.


