పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 15, 16 తేదీలలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వాణిజ్య, కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు అప్పగించేందుకు రైతు చట్టాలు తీసుకువచ్చిందన్నారు. రైతులు తిప్పికొట్టడంతో దొడ్డిదారిన అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహాసభలో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, కార్యదర్శి వెంకన్న, సహాయ కార్యదర్శి లాల్కుమార్, ఉపాధ్యక్షుడు రాజు, నాయకులు రత్నం తిరుపతి, దొండ ప్రభాకర్, రమేశ్, రాజేశ్, కిష్టన్న, తదితరులు పాల్గొన్నారు.


