నిర్మల్ఖిల్లా: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన ఆసం మురళి గత నెల ఉపాధి నిమిత్తం ఒమన్కు వెళ్లాడు. వారం రోజుల క్రితం అక్కడి లేబర్ క్యాంప్ నుంచి మెడికల్ పరీక్షల కోసం వెళ్లి తిరిగివస్తుండగా అదృశ్యమైనట్లు తోటి కార్మికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నారై కమిటీకి వినతి...
బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి తమగోడు వెల్లబోసుకున్నారు. మురళిని క్షేమంగా స్వదేశానికి రప్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితుని సోదరుడు సుమన్ వినతిపత్రం అందజేశారు. స్పందించిన స్వదేశ్ పరికిపండ్ల, ఈ–మైగ్రేట్ పోర్టల్ ద్వారా ఒమన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. ఢిల్లీలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కార్యాలయానికి కూడా వివరాలు పంపినట్లు వివరించారు.


