మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముందస్తు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీంకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో పన్ను చెల్లించిన వారికి మాత్రమే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ముందస్తుగా చెల్లించేందుకు ప్రభుత్వం 5 శాతం రిబేట్ కల్పించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పన్ను చెల్లింపులకు అవకాశం కల్పించింది. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో రూ.30.60 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా ఈ ఏడా ది మార్చి 31 వరకు రూ.19.70 కోట్లు వసూలైంది. ఎర్లీబర్డ్ స్కీంలో భాగంగా రూ.7.24 కోట్లు వసూలైంది. స్కీంపై పూర్తి అవగాహన కల్పించక పోవడంతోనే ప్రజలు ముందస్తు పన్ను చెల్లింపులకు ముందుకు రాలేదని తెలుస్తోంది.
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎర్లీబర్డ్ స్కీమ్ కింద రూ.కోటి 13 లక్షల ఆదాయం సమకూరినట్లు మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి సతీష్ తెలిపారు. మున్సిపాలిటీలో మొత్తం రూ.5 కోట్ల 28 లక్షలు డిమాండ్ ఉండగా ఏప్రిల్ 1 నుండి 30 వరకు చేపట్టిన ఎర్లీబర్డ్ స్కీమ్ ద్వారా 21 శాతం రూ.కోటి 13 లక్షలు వసూలైనట్లు ఆయన తెలిపారు.
మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎర్లీబర్డ్ స్కీమ్ కింద రూ.54.80 లక్షలు వసూలయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో రూ.2 కోట్ల 46 లక్షలు డిమాండ్ ఉండగా సింగరేణి రూ.32.99 లక్షలు, ఆర్యన్ కోల్వాషరీ రూ.5.80 లక్షలు చెల్లించడంతో మరికొంత ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద పే చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 23.92 శాతం వసూలైంది.
మందమర్రిలో
రూ.54.80 లక్షలు
క్యాతనపల్లిలో
రూ.1.13 కోట్లు


