దండేపల్లి: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. లక్సెట్టిపేట–నిర్మల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా మిల్లుల ట్యాగింగ్ రాలేదని, కాంటాలు వేయడం లేదని అన్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు ప్రాంభించి, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఎస్సై తహాసీనొద్దీన్ రైతులు, నాయకులతో మాట్లాడి సమస్యను ఫోన్లో తహసీల్దార్ రోహిత్దేశ్పాండే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో కాంటాలు ప్రారంభిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, నాయకులు వెంకటేష్, కిషన్, సురేష్, అనిల్, శ్రీనివాస్, మొండయ్య, గురువయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


