సారంగపూర్: వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు వాగులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్లో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన సాతెల్లి సాయన్న–పోసవ్వ దంపతులకు కొడుకు సాయిప్రసాద్(23), కూతురు సంతానం. సాయిప్రసాద్ తన స్నేహతులతో కలిసి సరదాగా సమీపంలోని వాగుకు ఈతకు వెళ్లాడు. వాగులో దిగిన కొంత దూరం వెళ్లాక లోతు ఉండడంతో స్నేహితులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఈతరాని సాయిప్రసాద్ నీటిలో మునిగి మృతి చెందాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయగా సమీపంలోని రైతులు వచ్చే సరికే సాయిప్రసాద్ నీటిలో మునిగిపోయాడు. ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


