సాత్నాల: భోరజ్ మండలం పెన్గంగ నదిలో స్నానానికి వెళ్లి తోటవార్ కిరణ్(19) అనే విద్యార్థి సోమవారం గల్లంతయ్యాడు. ఎస్సై పవర్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలానికి చెందిన కిరణ్ ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. పిట్టలవాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ వాచ్మెన్ సాయి వంశీ పెన్గంగ వద్ద పూజ ఉందని ఉదయం కుటుంబంతో సహా వెళ్లాడు. వారితోపాటు హాస్టల్ విద్యార్థులైన కిరణ్, తరుణ్ కూడా వెళ్లారు. నదీ తీరంలో వారు పూజలు నిర్వహిస్తుండగా, స్నానం కోసం కిరణ్, తరుణ్ నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇరువురు నీటిలో మునిగే క్రమంలో కేకలు వేశారు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దూకి వారిని కాపాడేందుకు యత్నించాడు. తరుణ్ను ముందుగా ఒడ్డుకు చేర్చగా, కిరణ్ నీటిలో కొట్టుకుపోయాడు. ఎంత వెదికినా ఆచూకీ లభించకపోవడంతో విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. చీకటి పడడంతో పోలీసులు గాలింపు చర్యలను నిలిపివేశారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.


