ఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగి వద్ద డబ్బులు వసూలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదివారం పోలీస్స్టేషన్లో వివరాలను వెల్లడించారు. భోరజ్ మండలంలోని పూసాయి గ్రామానికి చెందిన తప్రే సంతోష్ అనే వ్యక్తి గతంలో రిమ్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మానేశాడు. తిరిగి అదే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితులు అతని వద్ద నుంచి రూ.40,000 వసూలు చేశారు. కాగా ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన లేబర్ యూనియన్ నాయకుడు సిర్ర దేవేందర్, సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్లు అబ్దుల్ ముజీబ్, డోంగ్రి చంద్రకాంత్లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు.


