ఆదిలాబాద్టౌన్: వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం జిల్లాలో ఏకకాలంలో 16 మండలాల్లో 45 బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించగా, ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్పీ శుక్రవారం వెల్లడించారు. దాదాపు వంద మంది వడ్డీ వ్యాపారులను తనిఖీ చేసి, జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 15 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ భూ ములు కుదువుపెట్టుకుని, కొందరు రైతుల భూములను తమ పేర్లపై రాయించుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్నవారిపై దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్బుక్కులు, ఖాళీ స్టాంప్ పేపర్లు, బాండ్ పేపర్లు, సేల్డీడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఖుర్షీద్నగర్కు చెందిన నాయిని సుదర్శన్, తలమడుగు పోలీస్స్టేషన్లో దేవాపూర్కు చెందిన కటకం రాజు, శ్రీనివాస్, మావల పోలీస్స్టేషన్లో 170 కాలనీకి చెందిన కుంటి లింగన్న, మావలకు చెందిన దుర్గారెడ్డి, నేరడిగొండ పోలీస్స్టేషన్లో తేజపూర్కు చెందిన గంగారెడ్డి, నేరడిగొండకు చెందిన శ్రీనివాస్, జుంబేరాత్ రాహుల్, తాంసి పోలీస్స్టేషన్లో కప్పర్లకు చెందిన ఉప్లంచి నగేశ్, ఉప్లంచి గంభీర్, ఇచ్చోడ పోలీస్స్టేషన్లో గొతి సుందర్ సింగ్, గిట్టే మారుతి, కడమ్ సుదర్శన్, కడమ్ సాయికృష్ణ సిద్ధాంత్, గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో మన్నూరు గ్రామానికి చెందిన దహాలే పవన్పై కేసులు నమోదైనట్లు వివరించారు.


