జాతర్లలో కూలీ.. | - | Sakshi
Sakshi News home page

జాతర్లలో కూలీ..

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

బజార్‌హత్నూర్‌: విద్యుత్‌ షాక్‌తో కూలీ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్‌శాఖ సబ్‌ ఇంజినీర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు నార్నూర్‌ మండలంలోని గుంజాలకు చెందిన కాంట్రాక్ట్‌ కూలీ సోయం గంగాధర్‌ (26) ఈ నెల 21న బజార్‌హత్నూర్‌ మండలంలోని జాతర్ల ఫీడర్‌ విద్యుత్‌ లైన్‌ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. అందులో భాగంగా జాతర్ల ఫీడర్‌ లైన్‌ ఎల్‌సీ తీసుకున్నాడు. కానీ అతను జాతర్ల ఫీడర్‌ 11 కేవీ విద్యుత్‌ స్తంభం ఎక్కాల్సి ఉండగా పొరపాటున మిషన్‌ భగీరథ 11 కేవీ విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌కు గురై కిందపడ్డాడు. వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

వడదెబ్బతో వ్యక్తి..

భైంసాటౌన్‌: పట్టణంలోని ఏఎంసీ యార్డులో దడువా యిగా పనిచేస్తున్న పాపేశ్వర్‌ (50) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సోన్‌ మండలం బొప్పారం గ్రామానికి చెందిన పాపేశ్వర్‌ దడువాయిగా పనిచేస్తూ, ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం రోజంతా ఎండలో పనిచేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం తోటి దడువాయిలు ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు ..

నేరడిగొండ: బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో తండ్రి మృతి చెందగా, కుమార్తె గాయాలతో బతికి బయటపడింది. ఎస్సై ఇమ్రాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన గోడం జ్యోతిరామ్‌ (48) కుమార్తె సారులత బుగ్గారం(బి) గ్రామంలోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు జ్యోతిరామ్‌ బైక్‌పై బుగ్గారం వెళ్లాడు. తిరుగుప్రయాణంలో రోల్‌మామడ వద్ద గల వంతెనను దాటుతున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. జ్యోతిరామ్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. సారులత స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పథకం ప్రకారమే హత్యాయత్నం

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారమే హత్య చేసేందుకు ఓ వర్గం మరో వర్గంపై దాడికి పాల్పడిన ఘటన గురువారం సంచలనం సృష్టించింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు సీసీసీ రాంనగర్‌కు చెందిన పనాస రాజేందర్‌, అన్వేష్‌, గొర్రె ప్రసాద్‌ మండి బిర్యాని తినేందుకు బుధవారం రాత్రి సుమారు 10 గంటలకు మంచిర్యాలకు వచ్చారు. అక్కడ వారి పాత స్నేహితులు దీపక్‌, బిట్టు, శ్యామ్‌ కలవడంతో అందరూ కలిసి బార్‌కు వెళ్లి మద్యం సేవించారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకున్న దీపక్‌ తన స్నేహితులకు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. బయటకు వెళ్లిన తర్వాత రాజేందర్‌, ప్రసాద్‌, అన్వేష్‌పై ప్రథకం ప్రకారం కర్రలు, బీరు సీసాలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రాజేందర్‌, అన్వేష్‌కు తీవ్ర గాయాలుకాగా ప్రసాద్‌ స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న పో లీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. రాజేందర్‌ తండ్రి చిన్న య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యామ్‌, దీపక్‌, బిట్టు, నితిన్‌, రంజిత్‌, భరత్‌, మరి కొందరిపై కేసు నమె దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఒకరిపై హత్యాయత్నం

నర్సాపూర్‌ (జి): మండలంలోని టెంబరేణిలో ఒకరిపై హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు. టెంబరేణికి చెందిన ధనుసుల మధును అదే గ్రామానికి చెందిన దాసరి శంకర్‌ బుధవారం సాయంత్రం మందలించాడు. దాన్ని మనసులో పెట్టుకున్న మధు రాత్రి దాసరి శంకర్‌ ఇంటికి వెళ్లి గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసిన పోలీసులు హత్యాయత్నానికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement