చెన్నూర్/చెన్నూర్రూరల్: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. మండలంలోని సుందరసాల గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామాన్ని పీఎంఏజేఏవై పథకంలో ఎంపిక చేసి చేపట్టబోయే పనులపై తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలని, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాలింతలు, చిన్నారులు, తల్లులకు ఇచ్చే పోషక ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్అలి, సర్పంచ్ గుండ మంజుల, పంచాయతీ కార్యదర్శి వంశీధర్ పాల్గొన్నారు. కాగా, చెన్నూర్ జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన లేఅవుట్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ, పట్టణ ప్రణాళికాధికారి సంపత్తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూమి అభివృద్ధి చేయాలని సూచించారు.


