కుంటాల: మండలంలోని వెంకూర్ గ్రామ శివారు కల్లూరు –కుంటాల రహదారిపై ఉన్న 107 మక్కల బస్తాలను చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ బుధవారం కుంటాల పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్త వెంకూర్ గ్రామానికి చెందిన రైతు మగ్గిడి చిన్న నారాయణకు చెందిన మక్కల బస్తాలు ఈనెల 4న వేకువజామున చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మహారాష్ట్రలోని బోకర్ ఎక్స్రోడ్ వద్ద దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.75వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భైంసా పట్టణానికి చెందిన షేహెబాజ్ అహ్మద్, షేక్ అతీఫ్, మహమ్మద్ సాహిల్ ఉద్దీన్, షేక్ జలాల్ అలియాస్ అర్బాజ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. షేక్ నోమన్ అలియాస్ షేక్ మన్నాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును చేధించిన ఎస్సై అశోక్, కానిస్టేబుళ్లు రంజిత్ కుమార్, రాజేందర్, శంకర్ రావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.


