బెల్లంపల్లి: మహేంద్ర బొలోరో వ్యాన్లో ఆవులను అత్యంత కర్కషంగా కబేళాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పోచమ్మ గడ్డ చౌరస్తా వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మహేంద్ర బొలోరో వ్యాన్ అతి వేగంగా వెళ్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేపట్టారు. అందులో 7 ఆవులు, ఓ దూడను తాళ్లతో బంధించి గడ్డి, తాగునీరు ఇవ్వకుండా పరిమితికి మించి తరలిస్తున్నట్లు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ రామటెంకి పరమేశ్, పెద్దపల్లికి చెందిన గౌస్ఖాన్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా జీవాలను చింతలమానేపల్లి సంతలో కొనుగోలు చేసి సిద్దిపేటలో అమ్మడానికి తరలిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఆవులను స్వాధీనం చేసుకుని గోశాలకు పంపించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


